Friday, February 24, 2023

Govinda Raja Swamy, Tirupathi.

 *వేంకటేశ్వరుడి ‘అన్న’ అందుకే తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చాడా?*


🔅 తిరుపతిలోని గోవిందరాజస్వామిని వేంకటేశ్వరుడి అన్నగా చెబుతారు. తిరుపతి వేంకటేశ్వరుడే స్వయంగా తాను తన అన్న గోవిందరాజులు చెప్పినట్టు నడుచుకొంటానని ఒకానొక సందర్భంలో చెప్పాడు. 

ఇక ఈ గోవిందరాజస్వామి దేవాలయం దగ్గర్లోని కొలను అనేక చారిత్రాత్మక ఉద్యమాలకు పుట్టినిల్లు. వైష్ణవోద్యమానికి రామానుజాచార్యలు ఇక్కడే బీజం వేసినట్లు చెబుతారు. 


🔅 శేషశయన స్థితిలో ఉన్న గోవిందరాజులు తమిళనాడులోని చిదంబరం నుంచి ఇక్కడికి వచ్చాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. 

ప్రాణ భయంతో అక్కడి పూజారులు స్వామివారిని ఇక్కడకు తీసుకొనిరాగా రామానుజాచార్యలు వారికి ఆశ్రయం కల్పించాడని శాసనాలు చెబుతాయి.

ఇలాంటి ఆసక్తికరమైన కథనం మీ కోసం..


🔅 తిరుపతిలోని గోవిందరాజ స్వామిని కలియుగ దైవం వేంకటేశ్వరుడికి అన్నగా పేర్కొంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు నుంచి అప్పుగా తీసుకొన్న సొమ్మును కొలిచి కొలిచి అలసిపోయిన స్థితిలో పడుకొన్న భంగిమలో గోవిందరాజస్వామి కనిపిస్తాడు.

ఆయన కాళ్ల వద్ద సొమ్మును కొలవడానికి వినియోగించిన కుంచె కూడా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా చరిత్రను అనుసరించి ఈ విగ్రహం తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చిందని గోవిందరాజ స్వామి దేవాలయంలోని శాసనాల వల్ల తెలుస్తుంది


🔅 పూర్వం చిదంబర క్షేత్రంలో శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయం ఉండేది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న క్రిమకంఠుడనే రాజు శివ భక్తుడు. అంతేకాకుండా విష్ణువు అంటే అసహించుకునేవాడు. ఈ క్రమంలోనే చిదంబరంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు.

అంతేకాకుండా ఆలయ పూజారులను తీవ్రంగా హింసించి చంపించడం మొదలు పెట్టాడు. దీంతో వైష్ణవ పూజారులు ప్రాణభయంతో రాజ్యాన్ని విడిచి చెల్లాచెదురుగా పారిపోయారు.


🔅 ఇందులో కొంతమంది ఆ విష్ణుమూర్తి ఉత్సవ మూర్తులను తీసుకొని తిరుమల ప్రాంతంలోని రామానుజాచార్యులను కలిసి తమ గోడును తెలియజేశారు.

దీంతో రామానుచా చార్యులు చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రస్తుతం గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రతిష్టింపజేసినట్లు తెలుస్తోంది.


🔅 అదే విధంగా చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలకు కూడా ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు చేశారు. అటుపై రామానుజా చార్యులు తన శిష్యుడైన యాదవ రాజు ద్వారా ఆ ఆలయానికి దగ్గర్లో ఒక గ్రామాన్ని నిర్మింపజేసాడు.అందులో చిదంబరం నుంచి వలస వచ్చిన పూజారుల కుటుంబాలు ఉండేలా చేశాడు. అయితే మరికొంతమంది గోవిందరాజ స్వామి దేవాలయంలో మొదట పార్థసారధి విగ్రహం పూజలు అందుకొనేదని చెబుతారు.


🔅 చిదంబరంలోని క్రిమకంఠుడి రాజు ఆగడాలు భరించలేక చిదంబరం లోని శేషశయన స్థితిలోని విగ్రహాన్ని నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి 24.2.1130 లో ఆలయంలో ప్రతిష్టింపజేశారని చెబుతారు. 

ఈ రెండు విషయాల్లో కొంత బేధం ఉన్నా చిదంబరంలో శేషశయన విష్ణుమూర్తి తిరుపతికి వచ్చి కొలువై ఉన్నట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతోంది.


🔅 ఇక గర్భగుడిలో గోవిందరాస్వామి విగ్రహం శేశాయి ఆదిశేషుని పై పడుకొన్నట్లు ఉంటుంది. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకొని, శంఖు, చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభి నుంచి కమలం ఉద్భవించి అందులో బ్రహ్మ ఉంటాడు. అంతేకాకుండా తలకు కిరీటం, దివ్యాభరణాలు కూడా స్వామివారికి ఉంటాయి.


🔅 మూలవిరాట్టు గోవిందరాజస్వామితో పాటు ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామనుజ, తిరుమంగై ఆళ్వారు, తదితర విగ్రహాలను మనం చూడవచ్చు. 

ఆలయం దక్షిణ భాగంలో రుక్మిణి, సత్యభామా సహితుడైన పార్థసారధి మందిరం ఉంది. 

వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.


🔅 ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం జరుగదు. అయితే తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలాగానే గోవిందరాస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్దతులే పాటిస్తారు. 

ప్రధాన ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. వీటి పై రామాయణ, మహాభారత గాధలను అందమైన శిల్పాల రూపంలో చెక్కారు.


🔅 తిరుపతి వేంకటేశ్వరుడి దర్శానానికి వెళ్లిన కొంతమంది భక్తులు తిరుపతి గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని కాని వెనుదిరగరు. ఇక కొండను ఎక్కలేని భక్తులు గోవిందరాజుని దర్శనం చేసుకొని వేంకటేశ్వరుడికి తమ కోర్కెలను చెప్పాల్సిందిగా వేడుకొని వెనుతిరుగుతుంటారు.

No comments:

Post a Comment